Tuesday, May 9, 2017

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ...

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ...

సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి లోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని. 

అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది. అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం
లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం కలగలేదు .

కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా
పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 

పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు రాయాలి . అందరి రికార్డులూ రాసేసినా ఎందుకో ఆమెకు మహేశ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . 

వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి. మహేశ్ వివరాలు నమోదుచేయాలి. ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.
అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది.

 " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు . అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ "

రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన
జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు "

మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ
అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "

నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు "

సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .
అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సరోజ తలమునకలైంది. మహేశ్ నీ సానుభూతితో
చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 

టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇస్తున్నారు . అందమైన రంగుకాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు . ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేశ్. ఆ బ్యాగ్ సగం చిరిగి ఉంది .  అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి " చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .

ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది .
క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .

ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .

ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు . మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది. అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం .

మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో " నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "

మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ ".

ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .

ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
ఇంకో ఉత్తరం వచ్చింది .

" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక "

సరోజ పెళ్ళికి వెళ్ళేటపుడు మహేశ్ ఐదవ తరగతిలోబహూకరించిన నెక్లెస్ ధరించింది..

అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి .

ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించింది.